తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించిన ఏఎస్ఐ
పాలంపేట రామప్ప దేవాలయం వద్ద హెరిటేజ్ వాక్
పీఎస్టీయూలో ఆర్కియాలజీ, సంస్కృతి మరియువారసత్వంపై విద్యా కార్యక్రమాల నిర్వహణ
గీతం యూనివర్సిటీ లో రామప్ప దేవాలయం పై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
TOOFAN – 18 APR 2022
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించింది. గత చరిత్రను గుర్తుచేసుకుంటూ వారసత్వాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించే అంశాలపై అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ వస్తోంది.
ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా ప్రపంచ వారసత్వ సంపదగా గత ఏడాది యునెస్కో గుర్తించి ప్రకటించిన రామప్ప దేవాలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఏఎస్ఐ వరంగల్ సబ్ సర్కిల్, హైదరాబాద్ సర్కిల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన, రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు, కాకతీయ పాలకులు దేవాలయాన్ని నిర్మించారు. ప్రధాన వాస్తుశిల్పి రామప్ప పేరు మీద ఈ దేవాలయం రామప్ప దేవాలయం ప్రాచుర్యం పొందింది. వాస్తు శిల్పి పేరిట దేశంలో ప్రాచుర్యం పొందిన ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం ఒక్కటే.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (పిఎస్టియు)లో తెలంగాణ పురావస్తు, సంస్కృతి, వారసత్వం అనే అంశంపై విద్యాపరమైన సదస్సులు జరిగాయి. ఉదయం జరిగిన సదస్సుకు ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్మిత ఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ స్మిత ఎస్ కుమార్ ఈ కార్యక్రమాల వల్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి స్మారక చిహ్నాలను సంరక్షించి భావితరాలకు వాటిని అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు లక్ష్యాల మేరకు అమలు జరుగుతాయని అన్నారు.ప్రారంభోత్సవం అనంతరం పీటీఎస్యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేష్ ‘డెక్కన్ ఫిరంగులు- నిర్లక్ష్యానికి గురైన అందాలు’ అనే అంశంపై రూపొందించిన పత్రాన్ని డాక్టర్ ఎస్ జై కిషన్ సమర్పించారు. సదస్సుకు పీటీఎస్యూ, నిజాం కళాశాల, భవన్ కళాశాల విద్యార్థులు, ఓయూ ఆర్కియాలజీ విభాగం విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.