అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారని అన్నారు. ఎంత పెద్ద కేసులైనా పెట్టండి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ప్రలోభపెట్టి కొందరితో మాట్లాడించారని.. స్వయంగా సర్పంచ్ మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
యావత్ తెలంగాణ అసహ్యించుకునేలా తనపై దుష్ప్రచారం జరిగిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల భూములు ఆక్రమించానని, కుంభకోణాలు చేసినట్లు దుష్ప్రచారం చేశారన్నారు. 19 ఏళ్లపాటు కేసీఆర్తో కలిసి పనిచేశానని… తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో పోరాడే అవకాశం తనకు కల్పించారన్నారు. పార్టీకి మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు.
‘ఫ్లోర్ లీడర్గా, మంత్రిగా కూడా కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్కు మచ్చతెచ్చే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఏనాడూ అధర్మం వైపు వెళ్లలేదు. ఏనాడూ అణచివేతకు భయపడలేదు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు. డబ్బులను నమ్ముకోలేదు. అలాంటి కేసీఆర్ నాలాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకుని చర్చోపచర్చలు జరిపారు. అనంతరం అసత్య ప్రచారానికి ఒడిగట్టడం కేసీఆర్ స్థాయికి తగదు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఉంటే నేను శిక్షకు అర్హుడిని. ఏవో భూములు మీరే చూపించి మావే అని చెబుతున్నారు. రాజ్యం మీ చేతిలో ఉండవచ్చు, అధికారులు మీరు చెప్పింది చేయొచ్చు. భూములు కొలుస్తామని ఒక్క నోటీసు అయినా ఇచ్చారా? మేము లేకుండా వందల మంది పోలీసులను పెట్టి సర్వే చేయడం మీకు న్యాయసమ్మతమేనా?’
-ఈటల రాజేందర్, మాజీ మంత్రి
సీఎంగా మీకు ఎదురు చెప్పే పరిస్థితి ఎవరికీ లేదని ఈటల పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే ప్రజలు హర్షించరన్నారు. తనపై కేసులు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. కలెక్టర్ నివేదిక అందలేదని, మా వివరణ తీసుకోలేదని… మీ అధికారులకు వావివరసలు లేవంటూ వ్యాఖ్యానించారు..
కొత్త పార్టీ ఏర్పాటుపై ఈటల క్లారిటీ
నయీం గ్యాంగ్ నన్ను చంపేందుకు రెక్కీ
అప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతానా..!?
కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.