నేను ఏంచేయాలన్నా…ఇంకా 3 నెలలు పడుతుంది – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
బీజేపీలో చేరాలా లేక కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే ఎవరైనా కొత్త పార్టీ పెడితే వారితో కలిసి పనిచేయాలా? అని ఆలోచిస్తున్నానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఈ రోజు ప్రెస్మీట్ ఏర్పాటు చేసి విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మూడేళ్లు వెంటబడితేనే తాను రాజకీయాల్లోకి వచ్చానని కొండా మరోసారి స్పష్టం చేశారు. తాను రాజకీయాలలోకి అనుకోకుండా వచ్చానని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షం కాదని తాను విశ్వసిస్తున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తం కాంగ్రెస్ పరిస్థితి బాలేదన్న ఆయన.. కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తోందని వాపోయారు. రైతు ఆందోళన ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వచ్చినా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. కేసీఆర్ వ్యతిరేకులను అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావాలన్నది తన అభిమతమన్నారు. బీజేపీలో చేరమని కొందరు మొదట సలహా ఇచ్చినా… వారే వద్దన్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరకైనా నీళ్ళు వచ్చాయా అని మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.తాను ఏం చేయాలనుకున్న దానిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి కనీసం మూడు నెలలు సమయం కావాలని చెప్పారు.