బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు కూడా జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ కూడా చేశారు కేటీఆర్. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని అని హెచ్చరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేశారు.
మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారన్న న్యాయవాది అందులో వివరించారు. మంత్రి కేటీఆర్ పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది ఇచ్చిన నోటీసులు ఉంది.
KTR Legal Notice to Bandi Sanjay