ఇక్రిశాట్ 50 వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈరోజు హైదరాబాద్ పఠాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ( ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఆరిడ్ట్రాపిక్స్ – ఇక్రిశాట్) 50 వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణకు సంబంధించి వాతావరణ మార్పుల పరిశోధనా కేంద్రాన్ని , ఇక్రిశాట్ రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రెండు సదుపాయాలను ఆసియా, సబ్ -సహరాన్ ఆఫ్రికాలోని చిన్న రైతులకు అంకితం చేశారు. ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను, ఈ ఉత్సవాల సందర్భంగా తీసుకువచ్చిన స్మారక తపాలా బిళ్లను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్రసింగ్ తోమర్, శ్రీ జి.కిషన్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వసంత పంచమి పర్వదినాన్ని గుర్తుచేసుకుంటూ ఇక్రిశాట్ 50 వసంతాల ఉత్సవాల సందర్బంగా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఇక్రిశాట్ కు, దేశానికి రాగల 25 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని అంటూ ప్రధానమంత్రి, నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిసాధనకు కృషి చేయాలన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వ్యవసాయానికి సహాయం అందించడంలో ఇక్రిశాట్ చేసిన కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు.. నీరు, నేల నిర్వహణ , పంట రకాల మెరుగుదల, పంటల వైవిధ్యం, పశుగణ సమ్మిళితత్వం వంటివాటి
విషయంలో ఇక్రిశాట్ పాత్రను ఆయన కొనియాడారు. రైతులను మార్కెట్ లతో అనుసంధానం చేసేందుకు అనుసరిస్తున్న సమగ్ర విధానాలను , పప్పుధాన్యాలను ప్రోత్సహించడాన్ని , ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో శనగ పంటను ప్రోత్సహించడంవంటి వాటిని ఆయన కొనియాడారు. “మీ పరిశొధనలు, సాంకేతికత వ్యవసాయం సులభతరం, సుస్థిరత సాధించడానికి ఉపకరించింద”ని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన వారిపై వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.అందువల్ల వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రపంచానికి భారతదేశం చేసిన అభ్యర్థనను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ -ఎల్.ఐ.ఎఫ్.ఇ (లైఫ్) గురించి . పి-3 విశ్వ అనుకూల ప్రజా ఉద్యమాలు, 2070 నాటికి భారత్ నెట్జీరో లక్ష్యాల గురించి ప్రదానమంత్రి ప్రస్తావించారు. ” ఈ విశ్వానికి అనుకూలమైన ప్రజా ఉద్యమం ప్రతి సమాజాన్ని, ప్రతి వ్యక్తిని వాతావరణ మార్పుల విషయంలో బాధ్యతతో వ్యవహరించేలా అనుసంధానం చేస్తుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, ఇది భారత ప్రభుత్వ చర్యలలో కూడా ప్రతిబింబిస్తోంది “అని ప్రధానమంత్రి అన్నారు.
దేశ 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్లు, ఆరు రుతువుల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి భారతీయ వ్యవసాయరంగానికి సంబంధించి ప్రాచీన అనుభవాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ మార్పులనుంచి రైతులను రక్షించేందుకు భారత్ ప్రధాన దృష్టి మూలాలలో అనుసంధానమవుతూ, భవిష్యత్కు ముందడుగు వేయడమని ప్రధానమంత్రి అన్నారు. మా దృష్టి 80 శాతంపైగా ఉన్న రైతులపై ఉంది. వారు చిన్న సన్నకారు రైతులు. వారు ఎంతో విలువైన వారు అని ప్రధానమంత్రి అన్నారు.
మారుతున్న భారతదేశానికి సంబంధించి మరో కోణం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, డిజిటల్ వ్యవసాయం భారతదేశ భవిష్యత్ అని అన్నారు. ప్రతిభ కలిగిన భారతీయ యువత ఈ రంగంలో ఎంతో కృషి చేయగలదన్నారు. పంట అంచనా, భూరికార్డుల డిజిటైజేషన్, పురుగుమందులు, పోషకాలను డ్రోన్ల ద్వారా వెదజల్లడం వంటి వాటిలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ వాడకం పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు . డిజిటల్ సాంకేతికత ద్వారా రైతులకు సాధికారత కల్పించేందుకు భారత్ కృషి నానాటికి పెరుగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
అమృత్ సమయం సందర్భంలో భారత్ వ్ావసాయంలో ఉన్నతస్థాయివృద్ధితో కూడిన సమ్మిళత వృద్ధిపై దృష్టిపెడుతున్నదని అన్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతునివ్వడం జరుగుతోందన్నారు. జనాభాలోని ఎక్కువ మందిని పేదరికం నుంచి బయటపడేసి వారికి మెరుగైన జీవనాన్ని కల్పించగల శక్తి వ్యవసాయ రంగానికి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఈ అమృత్ సమయం రైతులకు భౌగోళికంగా సంక్లిష్టంగా ఉన్న అంశాలలోనూతన అవకాశాలను కల్పించనున్నదన్నారు.
భారత్ ద్వంద్వ వ్యూహంతో పనిచేస్తున్నదని అంటూ ప్రధానమంత్రి, ఒకవైపు పెద్ద మొత్తంలో భూమిని నీటి పొదుపుద్వారా ,నదుల అనుసంధానం ద్వారా సాగులోకి తెస్తున్నామని అన్నారు. తక్కువ నీటిపారుదల ఉన్నచోట సూక్ష్మ నీటిపారుదల ద్వారా నీటి వాడకంలో సమర్ధతను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. మరోవైపు వంట నూనెల విషయంలో స్వావలంబనకు జాతీయ మిషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మిషన్ పామాయిల్ విస్తీర్ణాన్ని 6 లక్షల హెక్టార్లకు పెంచేందుకు లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు. ఇది భారతీయ రైతులకు ప్రతి స్థాయిలో ప్రయోజనకరం కానున్నదని ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రైతులకు మేలు చేస్తుందని అన్నారు. పంట కోత అనంతర అవసరాలను బలోపేతం చేయడం అంటే, కోల్డ్ చెయిన్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని 35 మిలియన్ టన్నులకు చేర్చడం, లక్షకోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రధానమంత్రి వివరించారు.
ఇండియా రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేయడం, వ్యవసాయ వాల్యూ చెయిన్ను ఏర్పాటు చేయడంపై దృష్టిపెడుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు. చిన్న రైతులను అప్రమత్తతో కూడిన శక్తిమంతమైన మార్కెట్ శక్తిగా తీర్చిదిద్దేందుకు వారిని వేలాది రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్.పి.ఒలు) గా సంఘటితం చేస్తున్నామన్నారు.
ఇండియా లక్ష్యం కేవలం ఆహారధాన్యం ఉత్పత్తినిపెంచడం కాదని, ఇండియాకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమ నిర్వహణకు సరిపడినంత ఆహారధాన్యాలు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. మేం ఆహార భద్రతపై దృష్టిపెట్టడంతో పాటు పౌష్టికాహార భద్రతపై దృష్టిపెడుతున్నాం. ఈ దార్శనికతతో మేం గత 7 సంవత్సరాలలో బయో ఫోర్టిఫైడ్ రకాలను రూపొందించాం అని అన్నారు.
ఇక్రిశాట్ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది ఆసియా, సబ్ సహరాన్ ఆఫ్రికా అభివృద్ధికి వ్యవసాయ పరిశోధనలు చేస్తుంది. ఇది మెరుగైన పంట రకాలు, హైబ్రిడ్ వంగడాల వంటి వాటిని రైతులకు అందజేయడం ద్వారా వారికి తోడ్పడుతుంది. అలాగే చిన్న రైతులు, మెట్ట ప్రాంత రైతులు వాతావరణ మార్పులు తట్టుకునేందుకు తోడ్పాటునందిస్తుంది.