సబ్ జూనియర్ బాయ్స్ హాండ్ బాల్ ఛాంపియన్స్ షిప్ ప్రారంభం
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన 37 వ సబ్ జూనియర్ బాయ్స్ నేషనల్ జాతీయ హాండ్ బాల్ ఛాంపియన్స్ షిప్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ…కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా ఒక్క జాతీయస్థాయి క్రీడా పోటీ జరగక చిన్నబోయిన భాగ్యనగరానికి హ్యాండ్బాల్ టోర్నమెంట్ పండుగ శోభ తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ వేదికగా ఇంత పెద్ద జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం రాష్ట్రానికే తలమానికమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సాహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దడానికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పన చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0. 5 శాతం రిజర్వేషన్లు ను కల్పించి క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి ఈ టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు తీసుకొచ్చిన జాతీయ హ్యాండ్బాల్ అధ్యక్షుడు జగన్ మోహన్రావును ఈ సందర్భంగా అభినందించారు.
దేశం నలుమూలల నుంచి 25 రాష్ట్రాల నుండి సుమారు 500 మంది క్రీడాకారులు, కోచ్ లు పాల్గొంటున్న ఈ ఛాంపియన్స్ షిప్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఇలాంటి ఈవెంట్లు మరిన్ని నిర్వహించటానికి క్రీడా సంఘాలు ముందుకు రావాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. క్రీడా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారలందిస్తామన్నారు. హైదరాబాద్ను స్పోర్ట్స్ హబ్గా రూపొందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, హాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జగన్ మోహన్ రావు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే, మాజీ హాకీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర హాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చామల ఉదయ్ చందర్ రెడ్డి, DYSO వెంకటేశ్వర రావు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.