‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి;
జత చేయబడ్డ రాష్ట్రాల కళలు, సంస్కృతి గురించి తెలుసుకోవాలని ప్రజలకు ఉద్భోధ
12 డిసెంబర్ 2021 – హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబిఎస్ బి) పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ బి ఎస్ బి కింద జత చేసిన హర్యానా , తెలంగాణ రాష్ట్రాల వివిధ ఆసక్తికరమైన అంశాలను, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియ చేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ 2021 డిసెంబర్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్ లోని నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ లో వీక్షించేందుకు తెరిచి ఉంటుంది.కళలు, సంస్కృతి ఇతివృత్తాలపై తీసుకువచ్చిన గుర్తించదగిన పుస్తకాలను ప్రచురణల విభాగం ఈ ఎగ్జిబిషన్ లో ఉంచింది.
ఈ సందర్భంగా తన ఆలోచనలను పంచుకుంటూ, ఈ జంట రాష్ట్రాల సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రాచుర్యం కల్పించడంలో , ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహద పడతాయని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.. రెండు రాష్ట్రాల ప్రజలను కలిపి మన సంపన్న, విభిన్న సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించగల ఈ చొరవ తీసుకున్నందుకు సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ శ్రీ బి.వినోద్ కుమార్ హాజరయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్ వో బి, పిఐబి, డిపిడి ,ఎఐఆర్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి , దేశ ప్రజల మధ్య భావోద్వేగ బంధాల ముడి ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న చొరవ. స్వాతంత్ర్యానంతరం దేశ ఏకీకరణలో గణనీయమైన పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 2015 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈబిఎస్ బి) కార్యక్రమాన్ని ప్రారంభించారు.